న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక యువతి ఆత్మహత్యకు యత్నించింది. అక్షరధామ్ మెట్రో స్టేషన్ పైనుంచి కిందకు దూకింది. అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సకాలంలో స్పందించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. గురువారం ఉదయం 7.28 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఒక యువతి అక్షరధామ్ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చింది. అక్కడ ఉన్న ఒక గోడపైకి ఎక్కి అంచునకు చేరింది. అక్కడ నుంచి కిందకు దూకేందుకు సిద్ధమైంది. గమనించిన మెట్రోస్టేషన్లోని సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు వచ్చారు. కొందరు ఆమెను మాట్లాల్లో దించి సముదాయించి కిందకు దించేందుకు ప్రయత్నించారు. సీఐఎస్ఎఫ్కు మరికొందరు ముందు జాగ్రత్తగా ఆమె కింద పడే చోట బ్లాంకెట్లు పట్టుకుని ఉన్నారు.
కాగా, సీఐఎస్ఎఫ్ అధికారులు ఎంత నచ్చజెప్పినా ఆ యువతి వినిపించుకోలేదు. అక్షరధామ్ మెట్రో స్టేషన్ గోడ అంచు పైనుంచి ఆమె కిందకు దూకింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్న బ్లాంకెట్లలో పడింది. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అయితే స్వల్పంగా గాయపడింది. ఆమె కాలికి గాయమైంది. ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. యువతి ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.