నోయిడా : క్యాబ్ డ్రైవర్ను దోపిడీ చేసి హత్య చేశారనే ఆరోపణలపై ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బాధితుడిని యూపీలోని కస్గంజ్ జిల్లాకు చెందిన హర్వేష్ సింగ్గా గుర్తించారు. నోయిడాలో క్యాబ్ డ్రైవర్గా పనిచేసే బాధితుడు హర్వేష్ సింగ్ను మే 26న నిందితులు హత్య చేయగా ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఏడుగురు నిందితుల్లో నలుగురిని రాహుల్, అబిద్, సోను, శివంలుగా గుర్తించారు. నిందితుడు తొలుత మే 26న క్యాబ్ బుక్చేసి తర్వాత క్యాన్సిల్ చేశాడు. ఘజియాబాద్ నుంచి ఝాన్సీకి ఆఫ్లైన్ బుకింగ్ చేయాలని నిందితుడు క్యాబ్ డ్రైవర్ను కోరగా అందుకు బాధితుడు అంగీకరించాడు.
ఝాన్సీకి చేరుకున్న అనంతరం నిందితుడు క్యాబ్ డ్రైవర్ ఫోన్, వ్యాలెట్తో పాటు కారును చోరీ చేసి ఆపై అతడిని హత్య చేశాడు. అయిదు రోజుల తర్వాత క్యాబ్ డ్రైవర్ మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో క్యాబ్ డ్రైవర్ సోదరుడు జులై 11న ఝాన్సీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నోయిడా పోలీసులకు కేసును బదలాయించగా దర్యాప్తును ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా క్యాన్సిల్డ్ రైడ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
ఆపై రాహుల్ను నోయిడా సెక్టార్ 62 నుంచి అదుపులోకి తీసుకున్నారు. సోను, అబిద్, శివంలను ఘజియాబాద్ నుంచి అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి సుదామదత్ శర్మ, షంషుద్దీన్, మహ్మద్ ఉమీద్లను అరెస్ట్ చేశారు. అప్పుల ఊబిలో ఉన్న నిందితుడు వాటిని తీర్చేందుకు డబ్బు కోసం ఘాతుకానికి పాల్పడ్డాడని ఇతర నిందితులు అతడికి సహకరించారని పోలీసులు చెప్పారు. నిందితుడికి ఎలాంటి నేరచరిత్ర లేదని తెలిపారు.