హైదరాబాద్ : నగరంలోని టోలిచౌకీలో గత వారం జరిగిన మహిళా న్యాయవాది హత్య కేసులో గోల్కొండ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పూర్వీకుల ఆస్తి విషయంలో తలెత్తిన వివాదంలో లాయర్ రైజున్నీసాను ఆమె నలుగురు సోదరులు దారుణంగా హత్య చేశారు. అరెస్టు అయిన వ్యక్తులు మొహ్మద్ ఆరీఫ్ అలీ(38), మొహ్మద్ రవూఫ్ అలీ(40), మొహ్మద్ హసన్ అలీ(36), మొహ్మద్ ఆసిఫ్ అలీ(37), సమీనా బేగం(37). వీరంతా టోలిచౌకీ నివాసులు.
వెస్ట్జోన్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ వివరాలను వెల్లడిస్తూ.. పలు చోట్ల ఉన్న ఆస్తుల విషయంలో అక్కాచెళ్లెళ్లకు, అన్నాదమ్ములకు మధ్య గొడవలు నెలకొన్నాయి. రైజున్నీసా న్యాయవాది అయిన కారణంగా కోర్టులను ఆశ్రయించి వ్యాజ్యాలను దాఖలు చేస్తుందని సోదరులు భావించారు. ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం ఐదుగురు నిందితులు గడిచిన గురువారం ఆస్తుల గురించి మాట్లాడుకుందామని చెప్పి రైజున్నీసా ఇంటికి వెళ్లి ఆమెను హత్య చేసినట్లు తెలిపారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు చెప్పారు. న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.