లక్నో: కుమార్తెను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన నిందితుడ్ని కోర్టు వద్ద ఆమె తండ్రి తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఈ ఘటన జరిగింది. బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన 25 ఏండ్ల దిల్షాద్ హుస్సేన్, ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో ఉన్నాడు. బదల్గంజ్ ప్రాంతంలో నివాసం ఉండే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) రిటైర్డ్ జవాన్ ఇంటికి సమీపంలో టైర్ పంక్చర్ షాపు నడిపాడు. ఈ క్రమంలో 2020 ఫిబ్రవరిలో మాజీ జవాన్ మైనర్ కుమార్తెను అతడు కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాలిక తండ్రి ఫిర్యాదుతో యూపీ పోలీసులు గత ఏడాది మార్చి 12న నిందితుడు దిల్షాద్ హుస్సేన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అతడి చెరలో ఉన్న బాలికను రక్షించారు. నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, అనంతరం రెండు నెలల్లో బెయిల్పై అతడు విడుదలయ్యాడు.
మరోవైపు ఈ కేసు విచారణ నిమిత్తం నిందితుడు దిల్షాద్ హుస్సేన్, గోరఖ్పూర్ కోర్టుకు శుక్రవారం వచ్చాడు. కోర్టు గేటు వద్ద ఉన్న అతడ్ని బాధితురాలి తండ్రి, బీఎస్ఎఫ్ మాజీ జవాన్ గమనించాడు. దీంతో ఆగ్రహం పట్టలేక తన వద్ద ఉన్న లైసెన్స్ గన్తో నిందితుడిపైకి కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
కాగా, కోర్టు సెక్యూరిటీ గార్డులు, కారు పార్కింగ్ మేనేజర్తోపాటు మరికొందరు నిందితుడిపై కాల్పులు జరిపిన రిటైర్డ్ బీఎస్ఎఫ్ జవాన్ను పట్టుకున్నారు. అనంతరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. నిందితుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.