భోపాల్: అడ్డుగా ఉన్న కారును పక్కకు తీయమన్నందుకు కూరగాయలు అమ్మే మహిళ, ఆమె కుమారుడిపై వైద్యుడు, అతడి సిబ్బంది దాడి చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి భన్వర్ కువాన్ ప్రాంతంలో ఒక క్లీనిక్ వద్ద ద్వారకా బాయి అనే మహిళ తన కుమారుడు రాజుతో కలిసి తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతున్నది. దీనిపై డాక్టర్ అనిల్ ఘాయ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అనంతరం తన కారును కూరగాయల బండి ముందు పార్క్ చేశాడు. దీంతో కారును పక్కకు తీయాలంటూ ఆ మహిళ అతడితో వాగ్వాదానికి దిగింది.
ఆగ్రహించిన డాక్టర్ అనిల్, తన సిబ్బందితో కలిసి ఆ మహిళతోపాటు ఆమె కుమారుడిపై దాడి చేశాడు. ఆమె కూరగాయల బండిని ఎత్తిపడేశారు. దీంతో అందులోని ఆలూ, ఉల్లిగడ్డలు రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు డాక్టర్ కావడంతో వారు తొలుత పట్టించుకోలేదు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. కూరగాయలు అమ్మే మహిళ, ఆమె కుమారుడిపై దాడి చేసిన డాక్టర్ అనిల్తోపాటు మరో ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.