న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం గురించి తెలిసిన భార్యను భర్త హత్య చేయించాడు. కిరాయి హంతకులు ఆమెను కత్తితో 16 సార్లు పొడిచి చంపారు. దేశ రాజధాని ఢిల్లీలోని మాళవియా నగర్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. నవీన్ గులేరియా కుమారుడ్ని ఒక ఉద్యోగి గురువారం సాయంత్రం 4.30కు ఇంటి వద్ద దింపాడు. అయితే, ఆయన భార్య హత్యకు గురైనట్లు గ్రహించి నవీన్కు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఇంటికి వచ్చిన అతడు రక్తం మడుగుల్లో ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
మహిళ హత్య గురించి పోలీసులకు సమాచారం అందగా ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. అనంతరం ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు జరిపారు. ఇద్దరు వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించినట్లుగా సీసీటీవీలో కనిపించింది. అయితే ఇంటి నుంచి ముగ్గురు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మహిళ భర్త నవీన్ మొబైల్ ఫోన్ను పరిశీలించగా గోవింద్పురి ప్రాంతంలోని మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. నవీన్ భార్య హత్య జరిగిన రోజు వారిద్దరు పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ హిస్టరీ ద్వారా బయటపడింది.
మరోవైపు నవీన్ ద్విచక్ర వాహనంలో రూ.50,000 నగదుతోపాటు మరో ఫోన్ను పోలీసులు గుర్తించారు. దాని ద్వారా కాంట్రాక్ట్ కిల్లర్లను అతడు సంప్రదించినట్లు తెలుసుకున్నారు. భార్య హత్య కోసం నవీన్ వారికి రూ.5 లక్షలు సుపారీగా చెల్లించినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో అతడితోపాటు కాంట్రాక్ట్ కిల్లర్లు సోను, రాహుల్ను అరెస్ట్ చేశారు. హత్యకు వినియోగించిన కత్తిని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
కాగా, మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధం గురించి తన భార్యకు నాలుగు నెలల కిందట తెలిసిందని నిందితుడు నవీన్ పోలీసులకు వెల్లడించాడు. ఆమె అనుమానించడంతో కిరాయి హంతకులతో భార్యను హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కిరాయి హంతకులు ఆమెను 16-17 సార్లు కత్తితో పొడిచి చంపినట్లు పోస్ట్మార్టంలో తెలిసిందన్నారు.