బెంగళూర్ : నగరంలోని ఎస్ఎంవీటీ రైల్వే స్టేషన్లోని ప్లాస్టిక్ డ్రమ్లో సోమవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. స్టేషన్ లోపల ఉన్న డ్రమ్ నుంచి దుర్వాసన రావడంతో డ్రమ్ను కట్ చేసి చూడగా లోపల మహిళ మృతదేహం బయటపడింది. బయపనహళ్లి రైల్వేస్టేషన్ ఎంట్రీ గేట్స్లోని ఓ ప్రవేశ ద్వారం వద్ద ఈ డ్రమ్ ఉంది. మహిళకు 31 నుంచి 35 ఏండ్ల వయసు ఉంటుందని భావిస్తుండగా ఇంకా బాధితురాలిని గుర్తించలేదు.
ఆటోలో డ్రమ్ను తీసుకువచ్చి..
ముగ్గురు వ్యక్తులు ఆటోలో డ్రమ్ను తీసుకువచ్చి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ వద్ద వదిలివెళ్లినట్టు ప్రాధమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఏపీలోని మచిలీపట్నం నుంచి బాడీని తీసుకువచ్చారని, అయితే ప్రత్యేక బృందాన్ని మచిలీపట్నానికి పంపగా ఇంకా మృతదేహాన్ని గుర్తించలేదని పోలీసులు తెలిపారు. మూడు నెలల్లో ఈ తరహా ఘటన ఇది మూడవది కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 4న యశ్వంత్పూర్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం చివరన బ్లూ ప్లాస్టిక్ డ్రమ్లో ఓ యువతి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. దుపట్టాతో గొంతు బిగించి యువతిని హత్య చేసినట్టు భావిస్తున్నారు.
మూడు నెలల్లో మూడో కేసు
ఇదే తరహాలో గత ఏడాది డిసెంబర్ రెండోవారంలో ఎస్ఎంవీటీ స్టేషన్లోని ప్యాసింజర్ ట్రైన్ కోచ్లో గోనె సంచిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మూడు ఘటనల్లోనూ బాధితులు మహిళలే కావడంతో పాటు అందరి వయసూ దాదాపు 30 ఏండ్లు కావడం గమనార్హం. ఈ మూడు కేసులు ఇంకా కొలిక్కిరాలేదని ఈ ఘటనల వెనుక సీరియల్ కిల్లర్ పాత్ర ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల తీరుతెన్నులు గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని మహిళలను పోలీసులు హెచ్చరిస్తున్నారు.