అలీఘఢ్ : యూపీలో అమానవీయ ఘటనలకు బ్రేక్ పడటం లేదు. మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోతుండగా దళితులపై వేధింపులు, అరాచకాలూ కొనసాగుతున్నాయి. అలీఘఢ్ జిల్లాలోని హర్దుగంజ్ ప్రాంతంలో దళిత యువకుడిని కొందరు తీవ్రంగా కొట్టడంతో అతడు మరణించిన ఘటన బుధవారం రాత్రి నగరియా భూధ్ గ్రామంలో వెలుగుచూసింది. బాధితుడిని రవీంద్ర(22)గా పోలీసులు గుర్తింంచారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హత్య కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.
బాధితుడు బుధవారం రాత్రి జలాలి ప్రాంతం నుంచి ఇంటికి చేరుకోగా రాజ్ బహుదూర్ సింగ్, ఆయన కుమారుడు ఠాకూర్ అనురాగ్ సింగ్, శిబ్బు అనే ముగ్గురు వ్యక్తులు దాడికి తెగబడ్డారని రవీంద్ర తండ్రి వెల్లడించారు. తమ కమారుడిని కులం పేరుతో దూషిస్తూ గోధుమలను చోరీ చేశాడని ఆరోపణలపై తీవ్రంగా గాయపరిచారని చెప్పాడు. ఇక ఘటన జరిగిన గ్రామానికి చేరుకున్న భీమ్ ఆర్మీ, ఆజాద్ సమాజ్ పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. దళిత యువకుడి హత్యోదంతంలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశామని పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.