బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటకలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక టీచర్ రెండో తరగతి విద్యార్థిపై వేడి నీళ్లు పోశాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంతేకల్లూర్ గ్రామంలో ఘనమఠేశ్వర గ్రామీణ సంస్థ నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలో అకిత్ అనే విద్యార్థి రెండో తరగతి చదువుతున్నాడు.
గత శుక్రవారం ఆ బాలుడు స్కూల్ డ్రెస్లో మలమూత్రాలు విసర్జించాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు హులిగెప్ప, సలసల కాగుతున్న నీళ్లను ఆ బాలుడిపై గుమ్మరించాడు. 40 శాతం కాలిన గాయాలైన ఆ విద్యార్థిని లింగసగూరు తాలూకా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటన అనంతరం టీచర్ హులిగెప్ప స్కూల్కు రావడం లేదు. అలాగే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ బాలుడి తల్లిదండ్రులకు స్థానిక నేతల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో భయంతో ఫిర్యాదు చేసేందుకు వారు ముందుకు రాలేదు. అలాగే పిల్లల సంక్షేమ సంఘం కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనను సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.