కోల్కతా: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు బస్సుకు నిప్పుపెట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో ఈ సంఘటన జరిగింది. సిక్కిం రవాణా సంస్థకు చెందిన ఒక బస్సు ఆదివారం మధ్యాహ్నం బెంగాల్ సఫారీ పార్క్ సమీపంలో మరో బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా బైక్పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడ్ని సచిన్ ఛెత్రిగా గుర్తించారు.
కాగా, ఈ రోడ్డు ప్రమాదంపై ఆగ్రహించిన స్థానికులు ఆ బస్సుకు నిప్పుపెట్టారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన అగ్నిమాపక సిబ్బందిని కూడా వారు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ బస్సు డ్రైవర్ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో జాతీయ రహదారి 31పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు భద్రతాపరమైన ఆందోళనతో ఈ మార్గంలో 48 గంటలపాటు బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు సిక్కిం ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.