పాట్నా: బహిరంగంగా పాటలు పాడుతున్నందుకు, ట్రాన్స్జెండర్ భార్యను భర్త కత్తితో పొడిచాడు. బీహార్లోని సివాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆనంద్ కుమార్ అనే వ్యక్తి 2019లో చప్రా జిల్లాలోని జనతా బజార్ ప్రాంతంలో డ్యాన్స్ పార్టీలు నిర్వహించాడు. ఈ క్రమంలో సెమారియా ప్రాంతానికి చెందిన ట్రాన్స్జెండర్ రియా రాజ్ ప్రేమలో పడ్డాడు. దీంతో వారిద్దరూ కోర్టు అనుమతితో పెళ్లి చేసుకున్నారు. మహారాజ్గంజ్ రైల్వేస్టేషన్ సమీపంలోని అద్దె ఇంట్లో కలిసి జీవిస్తున్నారు.
కాగా, పెళ్లైన కొన్నేళ్ల తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. రియా తన బృందంతో కలిసి బహిరంగంగా, ఇళ్లకు వెళ్లి సెలబ్రెటీ పాటలు పాడటం మానేయాలని ఆనంద్ డిమాండ్ చేశాడు. దీని నుంచి మాన్పించేందుకు ఢిల్లీకి కూడా తీసుకెళ్లాడు. అయితే గ్రామానికి రియా తిరిగి వచ్చింది. మిగతా ట్రాన్స్జెండర్లతో కలిసి ఇళ్లకు వెళ్లడంతోపాటు బహిరంగంగా పాటలు పాడసాగింది.
దీంతో ఆగ్రహించిన భర్త ఆనంద్ ట్రాన్స్జెండర్ భార్య రియాను పలుసార్లు కొట్టాడు. అయినప్పటికీ తీరు మారకపోవడంతో కత్తితో పొట్టలో మూడుసార్లు పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రియాను స్థానికులు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆనంద్ కుమార్ను అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.