పాట్నా: పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో రైడ్ చేసిన పోలీస్ అధికారిని కొందరు స్తంభానికి కట్టి దాడి చేశారు. బీహార్లోని మోతీహరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీపావళి నాడు ఛప్రా బహాస్లోని ధర్మపూర్ గ్రామంలో కొందరు మద్యం సేవించి పేకాట ఆడుతూ గొడవపడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సుగైలి పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI)గా విధులు నిర్వహిస్తున్న సీతారాం దాస్ తన సిబ్బందితో అక్కడకు వెళ్లారు.
అయితే, కొందరు జూదరులు పోలీస్ అధికారి సీతారాం దాస్ను చుట్టుముట్టారు. ఇద్దరు వ్యక్తులు ఆయనను ఒక స్తంభానికి కట్టేసి కొట్టారు. ఇక్కడ రైడ్ చేయమని ఎవరు చెప్పారో చెప్పాలని ఒక వ్యక్తి ఆ ఏఎస్ఐని ప్రశ్నించాడు. దీపావళి రోజున బీహార్లో ఎక్కడా పోలీస్ దాడులు జరగడానికి వీల్లేదని అతడు అన్నాడు.
కాగా, మొబైల్లో చిత్రీకరించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా పలువురిపై కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారి సీతారాం దాస్ను స్తంభానికి కట్టేసి కొట్టిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.