బెంగళూరు: ఒక మహిళపై యాసిడ్ దాడి చేసిన నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల మహిళను 27 ఏళ్ల నాగరాజు పెళ్లి పేరుతో కొన్నేళ్లుగా వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో రెండు వారాల కిందట ఆ మహిళ పని చేస్తున్న చోటకు వెళ్లాడు. మరోసారి తనను పెళ్లి చేసుకోవాలని అడిగాడు. ఆమె తిరస్కరించడంతో వెంట తెచ్చిన యాసిడ్ను ఆ మహిళపై పోసి పారిపోయాడు. 30 శాతం కాలిన గాయాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
మరోవైపు ఈ సంఘటన బెంగళూరులో కలకలం రేపింది. దీంతో పోలీసులు నిందితుడి ఊహా చిత్రం విడుదల చేశారు. అతడ్ని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు తమిళనాడు తిరువణ్ణామలైలోని ఆశ్రమంలో అతడు ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరు పోలీసులు శుక్రవారం అక్కడకు వెళ్లి సన్యాసి వేషంలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బెంగళూరుకు తరలిస్తుండగా మధ్య రాత్రి దాటిన తర్వాత కెంగేరి ప్రాంతం సమీపంలో పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేసి పారిపోయేందుకు అతడు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.