లక్నో : ఓ వ్యక్తి 18 నెలల క్రితం చనిపోయాడు. ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు డెత్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. కానీ అతను బతికే ఉన్నాడని చెప్పి 18 నెలల పాటు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచారు. ప్రతి రోజు అతనిపై గంగా జలం చల్లుతూ.. కోమా నుంచి బయటకు రావాలని భార్య ప్రార్థించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రావత్పురాకు చెందిన విమలేశ్ దీక్షిత్ ఆదాయపు పన్ను శాఖలోఉద్యోగిగా పని చేస్తున్నాడు. గతేడాది ఏప్రిల్ 22న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అయితే కార్డియాక్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కారణంగా దీక్షిత్ మరణించాడు. ఈ మేరకు ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు అతను చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు.
ఇక విమలేశ్ దీక్షిత్ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అతని గుండె కొట్టుకున్నట్లు భార్య భావించింది. దీంతో అంత్యక్రియలు నిర్వహించలేదు. అతను కోమాలోనే ఉన్నాడని భావించి ఇంట్లోనే డెడ్ బాడీని ఉంచారు. ఇక ప్రతి రోజు ఉదయం ఆ డెడ్ బాడీపై గంగాజలం చల్లి త్వరగా కోమాలో నుంచి బయటకు రావాలని భార్య ప్రార్థించేది.
అయితే గత ఏడాదిన్నర కాలంగా విమలేశ్ ఉద్యోగానికి రాకపోవడంతో అనుమానం వచ్చింది అధికారులకు. దీంతో అధికారులు ఆ ఇంటికి చేరుకోగా అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు, అధికారులు కలిసి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు. దీక్షిత్ కోమాలోనే ఉన్నాడని, డెడ్ బాడీని తీసుకెళ్లొద్దని భార్య మొండి పట్టు పట్టింది. మొత్తానికి పోలీసులు జోక్యం చేసుకుని డెడ్ బాడీని అక్కడ్నుంచి తరలించారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోమాలో ఉన్నాడని చెప్పి తమను నమ్మించారని కోపోద్రిక్తులయ్యారు. కుటుంబ సభ్యులు తరచూ ఆక్సిజన్ సిలిండర్లను ఇంటికి తీసుకెళ్లడం కనిపించిందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు.