రాయపూర్: కోర్టులో స్టేట్మెంట్ కోసం ఒక ఎస్ఐకు 45 సమన్లు జారీ అయ్యాయి. అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో ఒక కేసులో అరెస్టైన నిందితుడు బెయిల్ పొందలేక నాలుగేళ్లుగా జైల్లో మగ్గుతున్నాడు. ఛత్తీస్గఢ్లోని సర్గుజాలో ఈ సంఘటన జరిగింది. 2018 జూలై 23న డ్రగ్స్ అమ్ముతున్న దేవేంద్ర సింగ్ను సర్గుజా పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు అతడు జైలులోనే ఉన్నాడు. నిందితుడి బెయిల్ పిటిషన్లను కింది కోర్టుతోపాటు హైకోర్టు తిరస్కరించాయి.
మరోవైపు దేవేంద్ర సింగ్ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన ఎస్ఐ చేతన్ సింగ్ చంద్రకర్ ఇప్పటి వరకు కోర్టుకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీని కోసం కోర్టు ఆయనకు 45 సార్లు సమన్లు జారీ చేసింది. చివరకు అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో ట్రయిల్ కోర్టులో విచారణ జరుగకపోవడంతో నిందితుడు బెయిల్ పొందలేక నాలుగేళ్లుగా జైలులోనే ఉన్నాడు.
ఈ నేపథ్యంలో నిందితుడు దేవేంద్ర సింగ్ ఈ అంశంపై తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. 45 సార్లు సమన్లు, అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పటికీ స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఎస్ఐ చేతన్ సింగ్ ట్రయిల్ కోర్టుకు రాలేదని, దీంతో తాను బెయిల్ పొందలేక నాలుగేళ్లుగా జైలులోనే ఉంటున్నట్లు ఆరోపించాడు. దీంతో హైకోర్టు నలుగురు ఐపీఎస్లకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ముగ్గురు హైకోర్టుకు హాజరుకాగా, మరొకరు రాలేదు. దీంతో ఈ అంశంపై హైకోర్టు న్యాయమూర్తి సచిన్ సింగ్ రాజ్పుత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పోలీస్ అధికారి నుంచి వివరణ కోరారు. కేసు విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు.