Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని హయత్నగర్ సమీపంలోని కుంట్లూరులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ యువకుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడిని ములుగు జిల్లాకు చెందిన రాజేశ్(23)గా పోలీసులు గుర్తించారు. అయితే యువకుడి మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు అతని ఒంటిపై ఉన్న బట్టలను దుండగులు తొలగించినట్లు తెలుస్తోంది. ఎక్కడో హత్య చేసి ఇక్కడ మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. యువకుడి ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి సమీపంలోనే పాయింట్, పర్సు, షూ లభ్యమయ్యాయి.
హైదరాబాద్ శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో పని చేస్తున్న రాజేశ్.. ఇటీవలే తన స్నేహితుడి వద్దకు వచ్చాడు. హత్యకు ముందు రాజేశ్ ఎవరెవరినీ కలిశాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హైదరాబాద్లో ఉంటున్న తన స్నేహితుడి వద్దకు రాజేశ్ మే 20న వచ్చి 22వ తేదీ వరకు ఉన్నాడు. 23వ తేదీన ఇబ్రహీంపట్నం వెళ్తున్నట్లు చెప్పి.. తన స్నేహితుడి రూమ్ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మళ్లీ రాజేశ్ అతని ఫ్రెండ్కు ఫోన్ చేసి.. సొంతూరు వెళ్లేందుకు డబ్బులు కావాలని అడగ్గా, అతను పంపాడు. 26వ తేదీన రాజేశ్ ఫోన్ రింగ్ అయింది.. కానీ లిఫ్ట్ చేయలేదు అని డబ్బులు పంపిన ఫ్రెండ్ మీడియాకు వెల్లడించాడు. 27వ తేదీ నుంచి ఫోన్ స్విచ్ఛాప్ వచ్చిందని తెలిపాడు. హత్యకు గల కారణాలు తనకు తెలియవని అతను స్పష్టం చేశాడు.