Sankranthi | అచ్చంపేట : సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు ఇప్పించడం లేదని భర్తతో గొడవ పడి మనస్తాపానికి గురైన భార్య తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. లింగాల మండలం రాంపూర్ చెంచుపెంటకు చెందిన చిన్న బయన్న పెద్దవాగు బేస్ క్యాంపులో వాచర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. చిన్న భార్య నాగమ్మ(26)కు ఇద్దరు పిల్లలు భయమ్మ(3), యాదమ్మ (1) ఉన్నారు. భార్య నాగమ్మ సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు ఇప్పించాలని గురువారం ఉదయం భర్తతో గొడవ పడింది. వాచర్గా పనిచేస్తున్న చిన్న బయన్నకు గత నాలుగు నెలలుగా జీతం రాలేదు. దీంతో ఆర్థికంగా డబ్బులు లేక బట్టలు ఇప్పించడానికి ఇబ్బందిగా మారింది.
ఇక భార్య వేధింపులు తాళలేక బయన్న మన్ననూర్కు వచ్చాడు. అంతలోనే నాగమ్మ తన ఇద్దరు ఆడపిల్లలను ఇంట్లోనే గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఆమె కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనుమానం వచ్చి పెంటవాసులు ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి, పిల్లలు చనిపోయి ఉండగా మన్ననూర్లో ఉన్న భర్తకు సమాచారం ఇచ్చారు. భార్యాపిల్లల మృతదేహాలను చూసి బయన్న బోరున విలపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.