గురుగ్రామ్: ఫ్లైఓవర్ పైనుంచి కిందకు దూకి ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హర్యానాలోని గురుగ్రామ్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఎంఎస్సీ చదువుతున్న మహిళ శనివారం సాయంత్రం స్కూటీపై రాజీవ్ చౌక్ ఫ్లై ఓవర్పైకి చేరుకుంది. అనంతరం చేతి మణికట్టుకుని కోసుకుని వంతెన పైనుంచి కింద ఉన్న రోడ్డు మీదకు దూకింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు సదర్ పీఎస్ ఇన్స్పెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అయితే ఆమె ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు విద్యార్థిని ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది.