మెహిదీపట్నం : డబ్బులను అప్పుగా తీసుకుని వాటిని తిరిగి ఇచ్చే క్రమంలో సినిమాలలో వాడే నోట్లను ఇచ్చి మోసం చేసిన ఓ ముఠాను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది.
ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం….టోలిచౌకి సెవన్ టూంబ్స్ రోడ్డులోని శాలిని గార్డెన్ సమీపం లో నివసించే సమీనా రూహి (33) వద్ద కృష్ణారావు అనే వ్యక్తి 2019లో 2 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నా డు. కృష్ణారావు స్నేహితులైన సుదర్శన్ (45), ఎ.ఎస్ కిషోర్ (46), డి.ధన్వంత్ (39) లతో కలిసి సమీనా రూహికి డబ్బులను ఇవ్వడానికి మంగళవారం వచ్చారు.
ఈ క్రమంలో ఆమెకు సినిమాలలో వాడే నకిలీ కరెన్సీని ఇచ్చారు. నకిలీ నోట్లను గుర్తించిన సమీనా రూహి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు ఆమె ఇంటికి వచ్చి ముగ్గురిని పట్టు కున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.
కేసును అన్నీ కోణాల్లో విచారిస్తున్నామని ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.ఇదిలా ఉండగా కృష్ణారావుకు రెండు కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చిన విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని, దీనిపై విచారిస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు.