జాన్పూర్: వాళ్లు 16, 14, 11 ఏండ్ల వయసున్న ముగ్గురు అక్కాచెల్లెండ్లు. వారితోడ సోదరుడు గణేష్ ఉన్నాడు. తండ్రి తొమ్మిదేండ్ల క్రితమే మరణించడం, తల్లికి మూడేండ్ల క్రితం కండ్లు పోవడంతో ఆ పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. నలుగురు పిల్లలు కలిసి దొరికిన పనల్లా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ముగ్గురు అక్కాచెల్లెండ్లు ప్రీతి (16), కాజల్ (14), ఆర్తి (11) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం రాత్రి ఒకేసారి వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాన్పూర్ జిల్లా బద్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఫట్టుపూర్ దగ్గర సుల్తాన్పూర్ రైల్వే క్రాసింగ్పై జన్సాధారణ్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి వాళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కటిక పేదరికంతో విసిగిపోవడమే ఆ పిల్లల ఆత్మహత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గత సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు రాత్రి 11 గంటలకు ఫట్టుపూర్ దగ్గర విగతజీవులుగా మారారు.