రాయ్పూర్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అమ్మేశారు. బలవంతంగా రెండు పెళ్లిళ్లు చేశారు. ఆమెను నిర్బంధించి ఏడాదిగా పలువురు సామూహిక లైంగిక దాడులకు పాల్పడ్డారు. బాలిక అదృశ్యం కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఆమెను కాపాడారు. మహిళతో సహా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ జంజ్గిర్ చంపా జిల్లాలోని గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఏడాది కిందట కుటుంబానికి అండగా ఉండేందుకు నగరంలో పని చేయాలని భావించింది. దీని కోసం తన స్నేహితురాలిని కలిసింది. బంధువైన బిలాస్పూర్ జిల్లాలోని మహిళ వద్దకు స్నేహితురాలు ఆమెను తీసుకెళ్లింది.
కాగా, గత ఏడాది సెప్టెంబర్లో పెళ్లి పేరుతో కలిసిన ఉత్తరప్రదేశ్లోని మథురకు చెందిన ఇద్దరు వ్యక్తులకు బాలికను ఆ మహిళ పరిచయం చేసింది. ఆమెకు ఉద్యోగం కోసం సహాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. అయితే ఆ బాలిక ఏమీ నిర్ణయించుకోలేదు. ఈ క్రమంలో ఆమెకు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేసి బిలాస్పూర్కు తీసుకెళ్లారు. తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి మేజర్గా పేర్కొంటూ రహస్యంగా ఆమెకు పెళ్లి చేశారు. అనంతరం ఆ బాలికను రూ.80,000కు అమ్మేశారు. మథురకు తీసుకెళ్లి మరో పెళ్లి చేశారు. ఏడాదిగా నిర్బంధించిన బాలికపై పలువురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడులకు పాల్పడ్డారు.
మరోవైపు బాలిక కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చివరకు ఆ బాలిక మథురలో ఉన్నట్లు గుర్తించి ఆమెను రక్షించారు. ఏడాది తర్వాత ఆమె కుటుంబం చెంతకు చేర్చారు. బాధితురాలి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కిడ్నాప్ చేసి అమ్మేయడం, బలవంతంగా పెళ్లిళ్లు చేసి సామూహిక లైంగిక దాడులకు పాల్పడటం వంటి దారుణాలకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో మథురకు చెందిన మహిళతోపాటు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు జంజ్గిర్ చంపా పోలీసులు తెలిపారు.