సంగారెడ్డి : పటాన్చెరు మండలం పరిధిలోని భానూరు గ్రామంలో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు.. గ్యాస్ కట్టర్లతో మెషీన్ను కట్ చేశారు. ఏటీఎంలో ఉన్న నగదును దొంగలు చోరీ చేశారు. అయితే శుక్రవారం ఉదయం నగదు డ్రా చేసుకునేందుకు జనాలు రాగా, దొంగతనం జరిగిన విషయం వెలుగు చూసింది.
దీంతో అప్రమత్తమైన స్థానికులు.. బీడీఎల్ భానూరు పోలీసులకు సమాచారం అందించారు. పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి, ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి కలిసి చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఏటీఎంలో ఉన్న రూ. 15.70 లక్షల నగదును చోరీ చేసినట్లు పోలీసులు, అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.