చండీఘర్ : వ్యవసాయ పొలంలో ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. తన తల్లి పరిస్థితిని గమనించిన 11 ఏండ్ల కుమారుడు చాకచక్యంగా వ్యవహరించాడు. పోలీసు ఎమర్జెన్సీ నంబర్ 112 కు ఫోన్ చేసి తన తల్లిని కాపాడాలని వేడుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ధనీమహతాబ్ గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ధనీమహతాబ్కు చెందిన ఓ మహిళ తన వ్యవసాయ పొలానికి వెళ్లింది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆమెకు విషమిచ్చాడు. దీంతో కంగారుపడ్డ ఆమె కుమారుడు(11) సమయస్ఫూర్తితో పోలీసు ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేసి.. తన తల్లికి ఎవరో విషమిచ్చారని చెప్పాడు. అప్రమత్తమైన పోలీసులు 10 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుని, బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని సోమ దేవీగా పోలీసులు గుర్తించారు. ఆమెకు పాయిజన్ ఎవరిచ్చారు..? ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.