కావలసిన పదార్థాలు
బటన్ మష్రూమ్స్: పావు కిలో, ఆలుగడ్డ: ఒకటి, చీజ్ తురుము: అర కప్పు, ఆరిగానో, రెడ్చిల్లీ ఫ్లేక్స్: ఒక టీస్పూన్ చొప్పున, మిరియాల పొడి: చిటికెడు, మైదా పిండి, కార్న్ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, బ్రెడ్ క్రంబ్స్: ఒక కప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, చాట్ మసాలా: అర టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా
తయారీ విధానం
ముందుగా ఆలుగడ్డను ఉడికించి మెదపాలి. ఒక గిన్నెలో ఆలుగడ్డ ముద్ద, చీజ్ తురుము, మిరియాల పొడి, ఉప్పు, ఆరిగానో, రెడ్చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. మష్రూమ్స్ కింద కాడలాంటి దాన్ని తీసేసి డొప్పలో ఆలుగడ్డ మిశ్రమం కూరాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్ఫ్లోర్, కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి.
స్టవ్మీద కడాయి పెట్టి నూనె పోసి వేడి చెయ్యాలి. మష్రూమ్స్ను మైదా మిశ్రమంలో ముంచి, బ్రెడ్ క్రంబ్స్లో దొర్లించి కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. పైనుంచి చాట్ మసాలా చల్లుకుంటే వేడివేడిగా నోరూరించే మష్రూమ్ పాపర్స్ సిద్ధం.