YVS Chowdary Mother | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి యలమంచిలి రత్న కుమారి గురువారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. వయోభారంతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు.వైవిఎస్ చౌదరి తల్లి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, సన్నిహితులు వైవిఎస్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.ఈ విషాద సమయంలో తల్లి ప్రేమను, గౌరవాన్ని చూపిస్తూ వైవిఎస్ చౌదరి భావోద్వేగంతో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
తల్లి రత్న కుమారిని గుర్తు చేసుకుంటూ.. పెద్దలు ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోనివాళ్లని చూసి మందలిస్తూ ఉంటారు. అలాంటి సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’గారు. కానీ.. ఒక లారీడ్రైవర్ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలవారీ సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు.. సినిమాలు చూపించడం నుంచీ దేవాలయ దర్శనాలు, సీజనల్ పిండివంటలు, నిల్వ పచ్చళ్లు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. తన నోటి మీది లెక్కలతో బడ్జెట్ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మ.
వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి అనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు. అలాంటి మా అమ్మ (88 ఏళ్లు) ఈ గురువారం రాత్రి 8 గంటల 31 నిమిషాలకు ఈ భువి నుంచి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్లిపోయారు.’ అంటూ వైవిఎస్ భావోద్వేగానికి గురయ్యారు. వైవిఎస్ కుటుంబానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ‘ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని’ ప్రార్థిస్తున్నారు.