యాదాద్రి, డిసెంబర్ 27 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం మహాద్భుతంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం చాలా గొప్పదని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. నరసింహుడి క్షేత్రం తెలుగు ప్రాంతానికి పరిమితం కాకుండా యావత్ దేశ ప్రజలు వచ్చి చక్కగా దర్శించుకునే విధంగా నిర్మించారని పేర్కొన్నారు. ‘అఖండ’ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీందర్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డితోపాటు సినిమా బృందంతో సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చక బృందం బాలకృష్ణకు చతుర్వేద ఆశీర్వచనం అందజేయగా ఆలయ ఈఓ ఎన్.గీత స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం యాదాద్రి నూతనాలయాన్ని సందర్శించారు. ‘అఖండ’ సినిమా సక్సెస్తో తెలుగు రాష్ర్టాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్నానన్నారు. త్రిదండి చినజీయర్స్వామి సలహాలు, సూచనలతో యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని చక్కగా చేపడుతున్న సీఎం కేసీఆర్కు తెలుగు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞలు తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడాలని సూచించారు. శంకరాచార్యులు, ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి ఎంతో మంది అవధూతలు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారని పేర్కొన్నారు. ఒమిక్రాన్ మహమ్మారి నుంచి తెలుగు రాష్ర్టాల ప్రజలను కాపాడాలని నరసింహస్వామిని వేడుకున్నానని తెలిపారు. భగవంతుడు కనిపించాలని అనుకోవద్దని, కరుణించాలని కోరుకోవాలని సూచించారు. లక్ష్మీనరసింహస్వామి తన ఇష్టదైవమని, చిన్ననాటి నుంచి స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్నానని అన్నారు. యాదాద్రి నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకుడు మోహనాచార్యులు, ఏఈఓలు శ్రవణ్కుమార్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.