Article 370 | బాలీవుడ్ నటి యామి గౌతమ్ (Yami Gautham), ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆర్టికల్ 370’ (Article 370). ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జంభలే (Aditya Suhas Jambhale) దర్శకత్వం వహించగా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యానర్లపై ఉరి: ది సర్జికల్ స్ట్రైక్(Uri : The Surgical Strike) ఫేమ్ ఆదిత్య ధర్ నిర్మించాడు. ఇక ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాను అరబ్ దేశాలు బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఒక వర్గాన్ని మాత్రమే అణచివేతకు గురయినట్లు మరో వర్గం మొత్తం విలన్స్ అన్నట్లు చూపించారని అందుకే ఈ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించాయి. మరోవైపు ఈ సినిమా విడుదల కాకముందే ప్రధాని మోడీ కొన్ని విషయాల గురించి సరైన సమాచారం తెలుసుకోవాలంటే ‘ఆర్టికల్ 370’ లాంటి చిత్రాలను చూడాలని ప్రకటించాడు. దీంతో ఈ మూవీ చూసిన నెటిజన్లు కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ఇది ఒక బీజేపీ ప్రాపగండ మూవీ అని.. కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై యామి గౌతమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ‘ఆర్టికల్ 370’ అనేది దేశంపై ఉన్న ప్రేమతో తెరకెక్కించిన సినిమా అని తెలిపింది. కొందరు సినిమా చూడకుండానే రివ్యూ ఇస్తుంటారు. కానీ ఈ సినిమాపై బ్యాన్ మేము ఊహించలేదు. ఇందులో ఆందోళనకరమైన సన్నివేశాలు లేవు. ప్రేరణ కలిగించే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. సినిమా చూశాక తీర్పు చెప్పాలి కానీ ముందే ఎలా రివ్యూ ఇస్తారు. ఇది ప్రాపగండ మూవీ కాదు.. ఒక దేశభక్తి మూవీ అంటూ యామి వెల్లడించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన అనంతరం జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసే అంశం తెరపైకి వస్తుంది. అయితే ఆర్టికల్ 370ను రద్దు చేసే క్రమంలో కశ్మీర్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అనే ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో యామి గౌతమ్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా కనిపించనుండగా.. ప్రియమణి కీలక పాత్ర పోషించింది.