కల్యాణ వైభోగాన్ని కమనీయ కావ్యంగా ఆవిష్కరించిన వేదిక వెండితెర. నిత్య కల్యాణానికి పచ్చ తోరణమై అలరారుతున్న సెల్యులాయిడ్ స్క్రీన్పై హిట్టుకొట్టిన పండంటి కాపురాలెన్నో! ఆడవారి మాటలకు అర్థాలు వేరని.. అందుకే, అంతరార్థాన్ని గ్రహించిమసులుకోవాలని పురుషులను హెచ్చరించింది సినిమానే! అలకపాన్పు ఎక్కిన చిలిపి గోరింకను మచ్చిక చేసుకునే మంత్రం ఉపదేశించిందీ సినిమానే!! సంసార చదరంగంలో ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో చూపించిన ఘనతా సినిమాకే దక్కుతుంది. వెండితెరపై కాసులు కురిపించడమే కాదు, మానవ సంబంధాలను దృఢపరిచి, మాంగళ్య బంధం విలువ పెంచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. నేడు ప్రపంచ వివాహ దినోత్సవం సందర్భంగా వాటిలో కొన్ని గుర్తు చేసుకుందాం..
అలై పొంగెరా..
వివాహ బంధం అంటే ‘శ్వాస తుది వరకు వెలిగే వేదం..’ అని నిరూపించిన చిత్రం సఖి. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా నమ్మకమే అన్యోన్యతకు పునాది అని చాటిచెప్పింది. ‘చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్.. నేను నిద్రపోతే లేత గోళ్లు గిల్లవోయ్..’ అని ప్రణయసీమలో ఆలుమగల పరిశ్రమ ఎంత లలితంగా ఉండాలో బోధించింది. ఏఆర్ రెహమాన్ మంగళవాద్యాలు, మణిరత్నం పౌరోహిత్యంతో ఒక్కటైన ‘సఖి’ జంట ఆనాటి దంపతులకు మాత్రమే కాదు, ఈనాటి ఫాస్ట్ జనరేషన్ కపుల్స్కూ మేటి ఉపదేశం ఇస్తుంది. మాధవన్ నవ్వు, షాలిని నయనాలు, స్వర్ణమాల్య చలాకీ తనం ఇప్పటికీ గుర్తొస్తాయి. ప్రేమ వివాహం చేసుకున్న యువజంట జీవితంలో తలెత్తిన చిన్న అనుమానం పెను విపత్తుకు దారితీస్తుంది. కానీ, ఇద్దరి మాంగళ్యబలం ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తుంది. ఆలుమగలు అన్నాక గిల్లికజ్జాలు మామూలే! ఈ పరాకులు చిరాకు స్థాయిని దాటిపోతున్నాయని అనుమానం వస్తే వెంటనే ‘సఖి’ సినిమా చూసేయండి. ‘సుగంధ వనాన సుఖాల క్షణాలు..’ తక్షణం మీ ముందు ఉంటాయి!
మమ్మి పోయి డాడి వచ్చె..
బాపు, రమణ ద్వయం శ్రీకారం చుట్టిన ‘పెళ్లి పుస్తకం..’ ఒక ఆకారం దాల్చింది మాత్రం ‘మిష్టర్ పెళ్లాం’తోనే! భర్త భరించేవాడు. భార్య బాధితురాలు. ఆయనగారు లేచేసరికి టూత్బ్రష్ మీద పేస్ట్ పెట్టి ఉంచాలి. ఆపై కాఫీ అందించాలి. అటుతర్వాత సిగరెట్ వెలిగించడానికి ఇబ్బంది లేకుండా.. ఫ్యాన్ పక్కకు తిప్పాలి. చివరిగా ఆఫీసుకు వెళ్తున్న ఆయన.. ఆమె వంక కనీసం చూడడు, లీలగా అయినా ‘వెళ్లొస్తానోయ్..’ అని చెప్పడు. ప్రథమార్ధంలో ‘అయ్యవారి ఎక్కువ..’ చూపించిన బాపు.. ద్వితీయార్ధంలో మిష్టర్ గారి పెళ్లాన్ని.. ‘మిష్టర్ పెళ్లాం’ చేశాడు. ఆమె ఉద్యోగం చేస్తుంది. ఇంటి భారం నెత్తిన వేసుకుంటుంది. వంటింటికుందేలుగా మారిన శ్రీవారు మాత్రం ‘మమ్మి పొయ్యి డాడి వచ్చె ఢాం ఢాం ఢాం..’ అని పురుషాహంకార హూంకారాలు చేస్తుంటాడు. భార్యాభర్తల్లో ఆవిడ సరిసమానం అని ఆయన గుర్తించాక గానీ, ఆ సంసారం గాడినపడదు. 1993లో వచ్చిన ‘మిష్టర్ పెళ్లాం..’ ఇద్దరూ కలిసి చూడండి. కలహాల గ్రహాలు హాలు దాటి పారిపోతాయి. వంటింట్లోనూ సరసాల సరాగాలు వినిపిస్తాయి.
చిలుకా ఏ తోడు లేక..
ఆయన చాలా మంచివాడు. లంచం తీసుకోడు. పరాయి స్త్రీని కన్నెత్తి చూడడు. ఒక్కమాటలో చెప్పాలంటే శ్రీరామచంద్రుడు. ఆవిడా మంచిదే! కానీ, డబ్బుల్లేకున్నా డాబులకు పోతుంటుంది. నోరు పెద్దది. పంతం మనిషి. ఒక సమయంలో పేరాశతో తన జీవిత భాగస్వామిని పంచుకోవడానికి మరో భాగస్వామికి అవకాశం కల్పిస్తుంది. కోటి రూపాయలకు కట్టుకున్నవాణ్ని అమ్ముకుంటుంది. అంతులేని ఆనందాన్ని త్యజించి.. అగాధంలోకి వెళ్తుంది. ఆమె కథతో భార్యాభర్తల అనుబంధం గాఢత ఎంత చిక్కగా ఉండాలో చాటిచెప్పాడు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. తన శైలిలో హాస్యాన్ని మేళవిస్తూనే.. ‘శుభలగ్నం’తో చక్కని సందేశాన్ని అందించాడు. భర్తను కాదనుకున్నా, భార్యను వద్దనుకున్నా.. ఇద్దరి జీవితమూ కూలిపోతుంది! తప్పు ఎవరిదైనా మూల్యం ఇద్దరూ చెల్లించాల్సిందే!! ఒకరి తప్పును మరొకరు మన్నిస్తే.. ఆ దాంపత్యం మన్నికగా నిలుస్తుంది. ఈ సత్యాన్ని గ్రహిస్తే.. ఎడారంటి ఆశల వెనక ఎవరూ ఒంటరి నడక సాగించరు.
అప్పగింతలు.. ఒప్పందాలు..
ఈ మధ్యకాలంలో వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా పెండ్లిసందడిని ఆకాశమంత పందిరి, భూమండలమంత అరుగు వేసి చాటిచెప్పింది. పెళ్లితంతులో ప్రతి ఘట్టాన్నీ వివరిస్తూనే.. భార్యాభర్తల మధ్య అనురాగం ఎలా ఉండాలో చాటిచెప్పింది. నితిన్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రంలోని కథాంశం కాస్త కొత్తదే! అబ్బాయి చాలా మంచోడు. అమ్మాయి గుణవంతురాలు. అతనికి సంప్రదాయాలంటే ఇష్టం. ఆమెకు ఆచారాలంటే గౌరవం. వాటిని పాటించేవారంటే మరీ ఇష్టం. అభిప్రాయాలు కలవడంతో ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. అమ్మాయి తండ్రి పక్కా బిజినెస్మ్యాన్. భవిష్యత్తులో వైవాహిక జీవితంలో చికాకులు తలెత్తితే విడాకులు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని పెండ్లికి ముందే కాబోయే అల్లుడితో ఒప్పంద పత్రం రాయించుకుంటాడు. కానీ, కల్యాణ క్రతువులో ప్రతి ఘట్టం ఆ తండ్రిలో మార్పు తెస్తుంది. బంధాలను కలిపే మంత్రశక్తిని, కాగితాలు విడదీయలేవని అంగీకరిస్తాడు. ఆ యువజంట పెండ్లిని ‘శ్రీనివాస కళ్యాణం’ అంత ఘనంగా జరిపిస్తాడు.
అయిదు రోజుల పెండ్లి..
‘ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు.. శ్రీరస్తు పెళ్లిళ్లు.. శుభమస్తు నూరేళ్లు..’ కల్యాణం గురించి గీత రచయిత వేటూరి చేసిన తీర్మానం ఇది. ఒక్కరోజు పెండ్లి అంటేనే ఒడవని ముచ్చట అనుకుంటే.. అయిదు రోజుల పెండ్లి సందడిని అంగరంగ వైభవంగా చూపించారు దర్శకుడు గుణశేఖర్. ఈ సినిమా జయాపజయాల సంగతి అటుంచితే.. ‘వరుడు’ భర్త బాధ్యతను గుర్తు చేస్తుంది. కథానాయకుడు ఈ తరం కుర్రాడు. కానీ, ముహూర్తం తరలి వచ్చిన శుభవేళ.. తెరచేలం తొలగించే తరుణాన.. తన తరుణిని చూడాలనుకుంటాడు. అబ్బాయి మనసు తెలుసుకున్న అమ్మాయి.. తానూ లగ్నంలోనే ఆయనపై చూపు లగ్నం చేస్తాననే నిర్ణయానికి వస్తుంది. శుభ ఘడియలు ఆసన్నమైన వేళ ఓ ప్రమాదం ఇద్దరినీ విడదీస్తుంది. వధువును విలన్ అపహరిస్తాడు. అప్పటికింకా భార్య కాకపోయినా.. ఆమె కోసం ప్రాణాలకు తెగిస్తాడు హీరో. విలన్ను అంతమొందించి తనకు కాబోయే భార్యను కాపాడుకుంటాడు.