ముంబై: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా నిలిచాడు. అయితే ఇదేదో సినిమాలో నటించి కాదు. ఒక డ్రగ్స్ కేసులో అరెస్టయి. ముంబై నుంచి గోవా వెళ్తున్న ఒక నౌకలో రేవ్ పార్టీపై రెయిడ్ చేసిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు ఆర్యన్ దొరికిపోయాడు. ఈ కేసులో అతనికి ఇటీవలే బెయిలు లభించింది.
అయితే ఈ కేసు టేకప్ చేసిన ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ కేసు నుంచి వాంఖడేను తప్పించడం జరిగింది. దీంతోపాటు మొత్తం 8 కేసులను మరో ఎన్సీబీ అధికారికి హ్యాండోవర్ చేయనున్నారు. ఆయనే ప్రస్తుతం ఎన్సీబీ (ఆపరేషన్స్) విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉన్న సంజయ్ కుమార్ సింగ్. 1996 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సంజయ్.. గతంలో సీబీఐలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా కూడా సేవ చేశారు.
వాంఖడే నుంచి ఇలా పలు కీలకమైన కేసులను సంజయ్ సింగ్కు బదిలీ చేయడంపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ స్పందించారు. ఈ కేసుల నుంచి వాంఖడేను తప్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. ఇది ప్రారంభం మాత్రమే అంటూ కామెంట్ చేశారు.