‘థాంక్యూ’ సినిమా షూటింగ్ షెడ్యూల్ను పూర్తిచేసుకొని ఇటీవల ఇటలీ నుండి ఇండియాకు తిరిగొచ్చింది రాశీఖన్నా. షూటింగ్ సమయంలో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో విదేశాల్లో ఉన్నప్పటికీ తన ఆలోచనలన్నీ అనుక్షణం మాతృభూమి చుట్టే తిరుగుతుండేవని చెప్పిందీ ముద్దుగుమ్మ. కఠిన సమయాల్లో ఆత్మీయులకు దూరంగా ఉండటం మనసును కలచివేసిందని చెప్పింది. ఇటలీ షూటింగ్ అనుభవాల గురించి రాశీఖన్నా మాట్లాడుతూ ‘ఎన్నో సవాళ్ల మధ్య ఇటలీలో షూటింగ్ చేశాం. మేము భారతీయులమని తెలియడంతో చాలా ప్రదేశాల్లో షూటింగ్లు చేయడానికి అనుమతులు లభించలేదు. ఇండియాలో నెలకొన్న పరిస్ధితులు మాకు ప్రతికూలంగా మారాయి. అనుకున్న సమయంలో షూటింగ్ను పూర్తిచేయడానికి రోజుకు పద్దెనిమిది గంటల పాటు పనిచేయాల్సివచ్చింది. మేము కోరుకున్న సౌకర్యాలేవి లభించలేదు. అయినా కష్టాల్ని సంతోషంగా స్వీకరిస్తూ షూటింగ్ పూర్తిచేశాం. ఆ సమయంలో నా మనసంతా ఇండియా గురించిన ఆలోచనలతోనే నిండిపోయింది. ప్రజల కష్టాలకు సంబంధించిన వార్తలు చూసి ఎంతో ఆవేదనకు గురయ్యాను’ అని పేర్కొంది. ఇప్పటివరకు కామెడీ టైమింగ్తో కూడిన పాత్రలు తనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయని, వాటికి భిన్నంగా సరికొత్త పంథాలో ఈ సినిమాలో తన పాత్ర సాగుతుందని రాశీఖన్నా చెప్పింది. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.