హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తెలంగాణ బిల్డర్లు, కాంట్రాక్టర్లు గురువారం తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ను విరమించుకోవాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తిచేశారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లతో మంగళవారం మంత్రుల నివాస సముదాయంలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన వారి సమస్యలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు, వంతెనలు, అత్యవసర మరమ్మతుల పనులు నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉందని, ఈ సమయంలో సమ్మె, ఆందోళనలు చేస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. మూడు, నాలుగు రోజుల్లో కాంట్రాక్టర్ల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని హామీఇచ్చారు.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో సాంస్కృతిక కళాకారులే కీలకమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంసృతికశాఖ ఆధ్వర్యంలో కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు ప్రజా కళాకారుడు, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహకు మొదటి గుర్తింపు కార్డును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళాకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.