అయోమయంలో తెలుగు సినీ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. భవిష్యత్ ఏంటనే భయాందోళనలకు గురవుతున్నది. కరోనా ముందు కళకళలాడిన పరిశ్రమలో ఇప్పుడు కలవరం పుడుతున్నది.సినిమా నిర్మించాలా వద్దా అనే డైలామాలో వుంది. ఏ స్టార్ సినిమాకూ గ్యారెంటీ లేదు, ఏ నిర్మాతకూ పెట్టుబడి తిరిగొస్తుందన్న వారెంటీ లేదు.
థియేటర్లో సినిమాలకు తగ్గిన ఆదరణ, పెరిగిన ఓటీటీల ప్రభావం, భరించలేని టికెట్ రేట్లు, భారమైన నిర్మాణ వ్యయాలు…వెరసి సంప్రదాయ థియేటర్ సినిమాను సతమతం చేస్తున్నాయి. ఇక సినిమాలు చేయాలా వద్దా? అనే సందేహాలను నిర్మాతల్లో కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రెగ్యులర్ సినిమాలు చేసే పెద్ద నిర్మాతలు (గిల్డ్) ఒకవైపు, చిన్న నిర్మాతలు మరోవైపు తమ తమ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.
చిన్న నిర్మాతలు సినిమాల షూటింగ్లు ఆపేది లేదంటుంటే, పేరున్న ప్రొడ్యూసర్స్ మాత్రం ఆగస్ట్ 1 నుంచి తాత్కాళికంగా సినిమా చిత్రీకరణలు నిలిపివేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు టాలీవుడ్ సమస్యలు ఏంటి?, వాటి మూలాలు ఎక్కడున్నాయి?. సాధ్యమైన పరిష్కారాలు ఏవి? అనేది విశ్లేషిస్తే..
సినిమా పెట్టుబడికి కథ, హీరో ఇమేజ్, స్టార్ డమ్, వసూళ్లు సాధించగల సామర్థ్యాన్ని (క్రౌడ్ పుల్లింగ్) బట్టే సినిమా నిర్మాణ వ్యయాన్ని నిర్ణయించుకుంటారు. ఓ స్టార్ హీరో రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయలైతే, షూటింగ్ ఖర్చు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రచార ఖర్చులూ కలిపి మరో 50 కోట్ల రూపాయలు అవుతాయి.
ఆ వంద కోట్ల రూపాయల బడ్జెట్ మూవీకి ఓటీటీ, శాటిలైట్, ఇతర హక్కుల ద్వారా దాదాపు సగం పెట్టుబడి తిరిగొచ్చినా, మిగతాది థియేటర్ రెవెన్యూపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో ఫలానా హీరోకు ఇంత మార్కెట్ ఉంది. ఆ సినిమా ఓ మోస్తరు విజయం సాధించినా, అపజయం పాలైనా ఇంత అమౌంట్ తిరిగొస్తుంది అని నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు అంచనా ఉండేది.
ఇప్పుడా పరిస్థితి లేదు. స్టార్ హీరో సినిమా బాగా లేకుంటే, ప్రేక్షకులు తిరస్కరించే స్థాయి తీవ్రంగా ఉంటున్నది. ఓ కొత్త హీరో సినిమాలా మ్యాట్నీ షోలకే థియేటర్లో ఖాళీ సీట్లు కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలకు థియేటర్ ఆదాయం లేకపోవడం నిర్మాతలను కలవరపరుస్తున్నది. ఆ మధ్య ఓ పెద్ద స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయిన తీరు ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేసింది. కంటెంట్ లేకపోతే స్టార్ హీరో సినిమా అయినా తగ్గేదేలే అంటూ ప్రేక్షకులు సినిమాను తిరస్కరిస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు సినిమా ఆదాయ మార్గాలు పెరిగాయి. ఓటీటీ, శాటిలైట్, పరభాషా హక్కులు, ఆడియో..ఇలా వివిధ మార్గాల్లో నిర్మాతకు పెట్టుబడి వస్తున్నది. అయితే ఇది కేవలం స్టార్ హీరోల సినిమాలకే వర్తిస్తుంది. ఆ సినిమా విజయం సాధిస్తే తప్ప…కొత్త నటీనటుల సినిమాలకు ఏ మార్కెట్ లేదు. స్టార్ హీరోలకు ఉన్న వ్యాపార అవకాశాల దృష్ట్యా సినిమా నిర్మాణ వ్యయాలూ పెంచుతున్నారు.
పాన్ ఇండియా మార్కెట్ ఉందనే ధీమా నిర్మాతల్లో కలుగుతున్నది. అయితే సినిమా ఆడని పరిస్థితుల్లో పరిమితి దాటిన ఈ పెట్టుబడే నిర్మాత కొంప ముంచుతోంది. ఈ బడ్జెట్ను తగ్గించుకోవాలని, అందుకు హీరోల రెమ్యునరేషన్లో కోత విధించాలని ప్రస్తుతం యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రయత్నిస్తున్నది.
ఇప్పటికే కొంతమంది హీరోలతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తున్నది. పారితోషికాల తగ్గింపునకు వారు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు స్టార్స్ సహాయకుల ఖర్చుల తగ్గింపు, సకాలంలో సినిమాను పూర్తి చేయడం, ఇందుకు నటీనటులను సమయపాలన పాటించాల్సిందిగా కోరడం వంటివి నిర్మాతల సమావేశంలో చర్చకు వచ్చాయి.
ప్రస్తుతం టాలీవుడ్లో నిర్మాతలు పెద్దా, చిన్నా అనే పేరుతో చీలిపోయారు. సంప్రదాయ నిర్మాతల మండలి నిర్ణయాలను వ్యతిరేకించిన రెగ్యులర్ నిర్మాతలు యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనే ఓ కొత్త అసోసియేషన్ పెట్టుకున్నారు. ఇందులో దిల్ రాజు, స్రవంతి రవికిషోర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, అభిషేక్ అగర్వాల్, సునీల్ నారంగ్, యార్లగడ్డ సుప్రియ, సూర్యదేవర రాధాకృష్ణ, పి. రామ్మోహన్రావు తదితర నిర్మాతలున్నాయి. పదేళ్లుగా ఒక సినిమా కూడా నిర్మించని వారు సభ్యులుగా ఉన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్కు ఇవాళ నిర్మాత కష్టాలు ఎలా తెలుస్తాయి అన్నది గిల్డ్ సభ్యుల ప్రశ్న. ఏడాదికి నిర్మాణమయ్యే 200 పైచిలుకు చిత్రాల్లో మూడొంతులు మా సినిమాలే అన్నది చిన్న నిర్మాతల మాట. గిల్డ్ ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ ఆపినా తాము ఆపేది లేదంటున్నది ప్రొడ్యూసర్ కౌన్సిల్.
సినిమా దోపిడీకి గురవుతున్న అంశాల్లో వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) ఒకటి. మన దగ్గర క్యూబ్, యూఎఫ్వో, పీఎక్స్డీ వంటి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ ఉన్నాయి. వీటిలో క్యూబ్, యూఎఫ్వోలది ఆధిపత్యం. ఒక సినిమా వంద థియేటర్స్లో రిలీజ్ చేయాలంటే ఒక్కో ప్రింట్కు దాదాపు 9 వేల రూపాయల చొప్పున 9 లక్షల రూపాయలు కేవలం క్యూబ్, యూఎఫ్వోలకే ఖర్చవుతున్నది. ఈ భారాన్ని ప్రొడ్యూసర్స్ నుంచి తప్పించి డిస్ట్రిబ్యూటర్స్కు ఇవ్వాలని తాజాగా నిర్మాతల మండలి సమావేశంలో చర్చించారు. అయితే వీపీఎఫ్ ఖర్చులకు కూడా వసూళ్లు రాని సినిమాలకు నష్టాలు ఎవరు భరించాలి అనే ప్రశ్న డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఎదురువుతున్నది.
మొత్తం సినిమా బడ్జెట్ను చూసుకుంటే సినీ కార్మికుల వేతనాల ఖర్చు తక్కువే. వారి వేతనాలు అన్నీ కలిపినా మొత్తం ఖర్చుపై పదిశాతం మించి ప్రభావం పడదు. ఇటీవల సినీ కార్మికులు వేతనాల పెంపు కోరుతూ సమ్మె చేపట్టారు. వారికి ఎంత మేరకు వేతనాలు పెంచుతారు అనేది ఇంకా చర్చల్లోనే ఉంది.
ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ ఆపేస్తామని పెద్ద నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో పలువురు స్టార్స్ సినిమాల చిత్రీకరణలు నిలిచిపోనున్నాయి. వీటిలో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, దర్శకుడు బాబీతో సినిమా, బాలకృష్ణ గోపీచంద్ మలినేని చిత్రం, మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా, ఎన్టీఆర్ కొరటాల శివ కొత్త చిత్రం, అల్లు అర్జున్ ‘పుష్ప 2’, రామ్ చరణ్ శంకర్ సినిమా, విజయ్ దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రం, ప్రభాస్ ప్రాజెక్ట్ కె, ‘సలార్’, అఖిల్ ‘ఏజెంట్’, సమంత ‘యశోద’, విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ లాంటి చిత్రాల షూటింగ్స్ ఆగిపోనున్నాయి.
ప్రేక్షకులు కోవిడ్ టైమ్లో పూర్తిగా ఓటీటీలకే పరిమితమయ్యారు. దాంతో ఇప్పుడు థియేటర్లకు వాళ్లను ఆకర్షించడం కష్టమవుతున్నది. టికెట్ రేట్లు పెరగడం సామాన్యులకు భారమవుతున్నది. ఇప్పుడున్న హీరోలు కనీసం 3,4 సినిమాలు ఓకే చేసుకుని ఉన్నారు.
అవి రిలీజ్ అయ్యేప్పటకి మరో రెండేళ్లు పట్టొచ్చు. ఇవాళ మనం అనుకున్న కథ రేపు చూడబోయే ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందనేది ప్రశ్నార్థకం. అందుకే కంటెంట్ మీద ఇంకా ఫోకస్ చేయాలని అనుకున్నాం. ఓటీటీ విడుదలకు పరిమితి పెట్టుకోవడం మరో కీలకాంశం.
ప్రేక్షకుల నాడి అంచనా వేయకుండా సినిమాలు మొదలుపెట్టకూడదని భావిస్తున్నాం. నేను గతంలో ఓకే అనుకున్న ఒక పది స్క్రిప్టులు పక్కన పెట్టేశాను, అలాగే షూటింగ్ చేస్తున్న రెండు ప్రాజెక్టులు ఆపేశా. నిర్మాతలంతా పూర్తిగా రివ్యూ చేసుకోవాల్సిన సమయమిది.
థియేటర్లో టికెట్ రేట్ల పెంపు వల్ల సినిమాలకు ఆదరణ తగ్గిందనే చర్చ నిర్మాతల్లో జరుగుతున్నది. టికెట్ రేట్లను పట్టణాలు, నగరాల్లో సాధారణ థియేటర్లలో జీఎస్టీ కలిపి 100 రూపాయలు, సి సెంటర్లలో జీఎస్టీతో కలిపి 70 రూపాయలుగా ఉంచాలని, అలాగే మల్టీప్లెక్స్లలో జీఎస్టీతో కలిపి 125 రూపాయలు పెట్టాలని నిర్ణయించారు. ఇది థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు.
ఒకప్పుడు టీవీలో మూడు పూటలు సినిమాలు ప్రసారం అవుతున్నప్పుడు నిర్మాతలు పడిన ఆందోళనే ఇవాళ ఓటీటీ విషయంలోనూ కనిపిస్తున్నది. ఓటీటీలో అనేక రకాల కంటెంట్ ఉన్నందువల్ల థియేటర్ వైపు అడుగులు పడటం లేదని వారంటున్నారు. అయితే ఇటీవల విక్రమ్ అనే డబ్బింగ్ సినిమా హౌస్ఫుల్స్తో ఆదరణ పొందింది. నిర్మాతలకు పెట్టుబడికి మూడింతల లాభం తెచ్చింది.
అలాగే మేజర్ సినిమా విజయం సాధించింది. ఓటీటీల నుంచి వస్తున్న ఆదాయం నిర్మాతలను ఆదుకుంటున్నది. తాజాగా నిర్మాతల మండలిలో జరిగిన చర్చల్లో ఓటీటీలో స్ట్రీమింగ్కు భారీ బడ్జెట్ చిత్రాలకు 10 వారాల గడువు, పరిమిత బడ్జెట్ చిత్రాలకు 4 వారాల గడువు విధించారు.
6 కోట్ల రూపాయల లోపు నిర్మాణ వ్యయం ఉన్న సినిమాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఆడని సినిమా వల్ల థియేటర్లో జనం లేక, ఓటీటీలో త్వరగా స్ట్రీమింగ్ చేయక రెండు విధాలుగా నిర్మాత నష్టపోతాడన్నది మరికొందరు నిర్మాతల అభిప్రాయం.