Vivek Agnihotri | ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలో నిలుస్తుంటారు. ఏ సమస్యపై అయినా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్పై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే, తాజాగా ఇండిగో ఎయిర్ లెన్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం గంటన్నరకుపైగా ఆలస్యం కావడంతో ఇబ్బందులకు గురయ్యారు. అలాగే విమానంలో మరుగుదొడ్లు సైతం శుభ్రంగా లేవంటూ మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్లో ఆగ్రహం వెళ్లగక్కారు.
ఉదయం 11.10 గంటలకు విమానం ఎక్కానని.. మధ్యాహ్నం 12.40 గంటలకు వరకు విమానంలోనే ఉండిపోయానన్నారు. 1.30 గంటలు ఆలస్యమైనా విమానం క్రూ సిబ్బంది సైతం సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఆలస్యమవుతున్నాయని.. అయితే, ఇండిగోలో ప్రయాణికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విమానం జాప్యం తెలుసుకునే మార్గం లేదా? అంటూ ప్రశ్నించారు. అత్యాధునిక ఏఐ సాఫ్ట్వేర్ దేని కోసం అంటూ ప్రశ్నించారు. దిక్కుతోచని సిబ్బందితో పాటు ప్రయాణికులను ఏసీ టన్నెల్లో ఎందుకు బంధించారంటూ మండిపడ్డారు.
మరుగుదొడ్లు అన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని ఆగ్రమం వ్యక్తం చేశారు. నీటి కోసం ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారన్నారు. తాను ఇండిగోలో అరుదుగా ప్రయాణిస్తుంటానన్నారు. విమానయాన సంస్థలు, సిబ్బంది ఉదాసీనంగా, అహంకారంతో ప్రవర్తిస్తున్నాయన్నారు. విమానాలు 30 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే ఛార్జీలో కొంత వాపస్ చేయకూడదా అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. వివేక్ అగ్నిహోత్రి చివరిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. సెప్టెంబర్లో విడుదలవగా.. ఈ నెలలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది.