Gangs of Godavari | విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణచైతన్య దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. నేహాశెట్టి కథానాయిక. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం హైదరాబాద్లో దేవి థియేటర్లో ట్రైలర్ను విడుదల చేశారు. 1980 దశకం గోదావరి ప్రాంతం నేపథ్యంలో కథను చూపించారు.
ఇందులో లంకలరత్న అనే గ్రామీణ రాజకీయ యువకుడి పాత్రలో విశ్వక్సేన్ కనిపించారు. ఓ సామాన్యుడి అసమాన ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆసక్తిని పంచింది. పోరాట ఘట్టాలు రోమాంచితంగా సాగాయి. విశ్వక్సేన్ పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. గ్రామీణ రాజకీయాలు, ఆధిపత్య పోరాటం నేపథ్యంలో ట్రైలర్ ఆసాంతం ఉత్కంఠగా సాగింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అనిత్ మాదాడి, సంగీతం: యువన్శంకర్ రాజా, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.