విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న సినిమా ‘మట్టి కుస్తీ’. స్పోర్ట్స్ డ్రామా కథతో దర్శకుడు చెల్లా అయ్యావు ఈ చిత్రాన్ని రూపొందించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఆర్టీ టీమ్ వర్క్స్ , విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజ, విష్ణు విశాల్ నిర్మాతలు. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదలవుతున్నది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు తెలిపారు విష్ణు విశాల్.
భార్య భర్తల ప్రేమ కథ
భార్య భర్తల మధ్య ప్రేమ కథతో సాగే వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. క్రీడా నేపథ్యం కూడా కథలో మిళితమై ఉంటుంది. పెండ్లి తర్వాత భార్య భర్తలకు కొన్ని అంచనాలు ఏర్పడతాయి. వాటిని అందుకోలేనప్పుడే సమస్యలు మొదలవుతాయి. వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? అనేది చూపిస్తున్నాం. కేరళలో మట్టి కుస్తీ అనే క్రీడ ఉంది. దాని నేపథ్యంగా తీసుకున్నాం. ఈ కథలో నేను కబడ్డీ ఆటగాడిని..అయితే కుస్తీ పోటీలకు ఎందుకు వెళ్లాను అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి.
రవితేజతో స్నేహం
నా గత సినిమా ‘ఎఫ్ఐఆర్’ విడుదల సమయంలో హీరో రవితేజను కలిశాను. నేను చేసే సినిమాలు ఆయనకు నచ్చాయి. నెక్ట్స్ సినిమా ఏంటని అడిగితే ఈ కథ క్లుప్తంగా చెప్పాను. రవితేజకు నచ్చి సినిమా నిర్మిస్తానని ముందుకొచ్చారు. నన్ను బాగా నమ్మిన వ్యక్తి ఆయన. క్రికెటర్గా నటించాలని ఉంది. అలాగే సూపర్ హీరో సినిమా చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం స్వీయ నిర్మాణంలో మూడు చిత్రాలతో పాటు రజనీకాంత్ గారి ‘లాల్ సలాం’ చిత్రంలో నటిస్తున్నా. దర్శకులు మోహన్దాస్, సత్యజ్యోతి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నా.