Virosh | టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న తమ పెళ్లిని అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకునే క్రమంలొఓ గొప్ప మనసు చాటుకుంటున్నారు. పెళ్లి కానుకగా దేశవ్యాప్తంగా స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు ప్రముఖ దేవాలయాల్లో అన్నదానం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయపూర్ నగరంలో ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం హిందూ సంప్రదాయం ప్రకారం, సాయంత్రం కడువ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు నిర్వహించారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అనంతరం శనివారం ఉదయపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఈ జంటకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
పెళ్లి సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకగా మార్చి 1న దేశవ్యాప్తంగా స్వీట్లు పంపిణీ చేయనున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “దేశంలోని ప్రజలు ఎల్లప్పుడూ మా ప్రయాణంలో భాగమయ్యారు. మా ప్రేమలో, మా విజయాల్లో మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి. మా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ క్షణాన్ని మీతో పంచుకోవడానికి స్వీట్లు, ప్రేమ నిండిన ట్రక్కులను దేశవ్యాప్తంగా పంపిస్తున్నాం. అలాగే కొన్ని ప్రముఖ దేవాలయాల్లో అన్నదానం కూడా నిర్వహిస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి” అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, బీహార్, ఛండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అభిమానులకు స్వీట్లు పంచనున్నారు. ఏపీలో వైజాగ్, విజయవాడ, పుట్టపర్తి నగరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ ప్రాంతాల్లో స్వీట్లు పంపిణీ చేయనున్నారు.
ఇదే కాకుండా ప్రముఖ దేవాలయాల్లో అన్నదానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం (వైజాగ్), ద్వారకా తిరుమల ఆలయం (ఏలూరు), శ్రీ కనకదుర్గ ఆలయం (విజయవాడ)లో భక్తులకు అన్నదానం చేయనున్నారు. తెలంగాణలో సాయిబాబా ఆలయం (చింతపల్లి), మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయం (మహబూబ్ నగర్), హరే కృష్ణ హెరిటేజ్ ఆలయం (హైదరాబాద్)లో కూడా ఈ సేవా కార్యక్రమాలు జరగనున్నాయి. అదేవిధంగా కర్ణాటక, ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్, ఛండీగఢ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని దేవాలయాల్లో కూడా అన్నదానం నిర్వహించనున్నట్లు సమాచారం.ఇక హైదరాబాద్లోని ప్రముఖ తాజ్ హోటల్లో ఈ నెల 4న వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.