కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా నటించిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మురళి కిషోర్ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా జరిగిన కార్యక్రమంలో సినిమాలోని విశేషాలు తెలిపారు చిత్రబృందం. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ…‘రీసెంట్గా సినిమాను చూశాను. స్మోకింగ్ యాడ్ లేకుండా థియేటర్లకు వస్తున్న సినిమా ఇది. అంత క్లీన్గా మూవీ ఉంటుంది.
ఈ సినిమా ఫలానా తరహాది అని చెప్పడానికి లేదు. ఇందులో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్నాయి. నేనైతే థ్రిల్లింగ్ ఫ్యామిలీ మూవీ అని చెప్పాలనుకుంటున్నా. ఈ చిత్ర కథ, కథనాలు మీ ఊహకు అందవు. ఇలా జరుగుతుంది అనుకునేలోపు మరో మలుపు తీసుకుంటుంది. కిరణ్ అబ్బవరంతో పాటు మా టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాం.
దర్శకుడు తొలి చిత్రమైనా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఆయనకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఈ సినిమాతో హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ మరో మెట్టుకు చేరుకుంటుంది’ అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…‘మా సినిమాకు ముందు నుంచీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ చిత్రంతో విజయాన్ని సాధించబోతున్నామని అందరూ చెబుతుండటం సంతోషంగా ఉంది. ఇవాళ మంచి సినిమాకు హద్దులు లేకుండా ఆదరణ లభిస్తున్నది. డబ్బింగ్ సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. మా సినిమాలోని నేపథ్యం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చేరువయ్యేలా ఉంటుంది. కథను నమ్మి ప్రతి ఒక్కరం జాగ్రత్తగా పనిచేశాం. ఇది నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది’ అన్నారు.