కొత్త ప్రతిభను వెలికితీసేందుకు నిర్మాత దిల్ రాజు స్థాపించిన సంస్థ ‘దిల్ రాజు డ్రీమ్స్’. ఈ బ్యానర్లో తొలి ప్రయత్నంగా రూపొందుతున్న చిత్రం ‘మార్కండేయ’. విక్రాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్కు శిష్ట్లా వీఎంకే దర్శకుడు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. దిల్రాజు మాట్లాడుతూ ‘23 ఏండ్లలో 60 సినిమాలు నిర్మించిన మా ఎస్వీసీ సంస్థకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ మరో విభాగం. న్యూ టాలెంట్ కోసం స్థాపించిన బ్యానర్ దేశంలో ఇదొక్కటే. అందుకు గర్వపడుతున్నాం. మేం స్టార్స్తో కంటే మిడ్ రేంజ్ హీరోలతోనే ఎక్కువ విజయాలందుకున్నాం.
‘సంతాన ప్రాప్తిరస్తు’ తర్వాత హీరో విక్రాంత్ చేస్తున్న సినిమా ఇది. తనే ఈ కథ నా దగ్గరకు తెచ్చాడు. ఈ కంటెంట్ నచ్చి ‘దిల్ రాజు డ్రీమ్స్’ సంస్థ తొలి ప్రయత్నంగా ఈ సినిమా తీస్తున్నాం. సీజీ వర్క్ ఎక్కువగా ఉన్న చిత్రమిది. వచ్చే ఏడాది మహాశివరాత్రికి విడుదల చేస్తాం. ఈ మూవీ గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది. ఇదే ఈ యంగ్టీమ్కి టానిక్. ఈ సంస్థ నుంచి మరో నాలుగు సినిమాలు రానున్నాయి. వాటిలో రెండు ఓటీటీ, రెండు థియేట్రికల్గా రిలీజ్ అవుతాయి. ఇక మా ఎస్వీసీ సంస్థలో ఎల్లమ్మ, రౌడీ జనార్ధన, దేత్తడి చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి’ అని తెలిపారు.