‘విక్రమ్’ సినిమా ద్వారా నా కెరీర్కు ‘మరో చరిత్ర’ లాంటి విజయాన్ని తెలుగు ప్రేక్షకులు అందించారు’ అన్నారు కమల్ హాసన్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ విడుదల చేసింది. తాజాగా చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. హీరో రానా ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్హాసన్ మాట్లాడుతూ…‘ఖైదీ’ సినిమా చూసి లోకేష్కు ఒక అవకాశం ఇచ్చాము. ఆయన ఆ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుని మంచి విజయాన్ని అందించారు. ప్రతి పాత్రకూ పేరొచ్చింది. ప్రేక్షకులు రెండు మూడు సార్లు సినిమా చూస్తున్నారు. ‘మరో చరిత్ర’ సినిమా తర్వాత మళ్లీ నాకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిందీ సినిమా. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నా’ అని అన్నారు. ‘కమల్హాసన్ను చూసే సినిమా గురించి నేర్చుకున్నా. ఉదయం తెలుగు వెర్షన్, సాయంత్రం తమిళంలో ‘విక్రమ్’ సినిమా చూశాను. ఈ చిత్రంలో కమల్ నటన అద్భుతం. దర్శకుడి ప్రతిభ కూడా ఆశ్చర్యపరిచింది’ అని రానా అన్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..‘ఈ సినిమా ఘన విజయం సాధించింది, మున్ముందు ఇంకా పెద్ద విజయం సాధించబోతున్నది. కమల్ హాసన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా మిగిలిపోనుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.