Suriya | సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’ చిత్రం తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు సూర్యతో పాటు ఆయన సోదరుడు కార్తీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో మాట్లాడిన ఆర్జే బాలాజీ ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ గురించి ప్రస్తావించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన మాట్లాడుతూ.. “రెండేళ్ల క్రితం విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది ఆయనను నమ్మలేదు. నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ ఆయనకు ఆయన మీద నమ్మకం ఉంది. తన ఆలోచనలు, లక్ష్యాలపై విశ్వాసంతో ముందుకు వెళ్లారు. అదే నమ్మకం ప్రజల్లోనూ కలిగి, ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రిగా నిలిచారు” అని అన్నారు.
అంతేకాదు, పవన్ కళ్యాణ్ పేరును కూడా ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. మనల్ని మనం నమ్ముకుంటే అది ఎంతటి శక్తిగా మారుతుందో విజయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ నిరూపించారు. నేను కూడా ఆర్జేగా మొదలై నటుడిగా, ఇప్పుడు దర్శకుడిగా ఎదిగాను” అంటూ చెప్పుకొచ్చారు. అయితే సూర్య సినిమా ఈవెంట్లో మరో హీరో గురించి, ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ఎలివేట్ చేయడంపై కొంతమంది సూర్య అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఈవెంట్లలో రాజకీయాల ప్రస్తావన అవసరమా?”, సూర్య ఈవెంట్లో విజయ్ గురించి ఎందుకు మాట్లాడాలి?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
అయితే మరోవైపు హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అభిమానులకు గుర్తుచేస్తున్నారు నెటిజన్లు. ఆర్జే బాలాజీ విజయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు సూర్య స్వయంగా చప్పట్లు కొట్టి అభినందించారు. అలాగే విజయ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సూర్య సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన విషయం కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.