‘ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్ అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో విజయాన్ని అందిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు అగ్ర హీరో విజయ్ సేతుపతి. ఆయన నిత్యామీనన్తో కలిసి నటించిన ‘సార్ మేడమ్’ చిత్రం ఆగస్ట్ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు.
సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘ప్రతీ కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈ సినిమా కోసం పరాటా చేయడం నేర్చుకున్నా. దానికోసం రెండు నెలల కోర్స్ కూడా చేశా (నవ్వుతూ). చక్కటి కుటుంబ కథా చిత్రంగా అందరిని అలరిస్తుంది’ అన్నారు.
తెలుగు సినిమా చేసి చాలా రోజులైందని, కథ వినగానే వెంటనే ఓకే చేశానని, తమిళంలో మాదిరిగానే తెలుగు ప్రేక్షకులు కూడా మంచి విజయాన్ని అందిస్తారనే నమ్మకం ఉందని కథానాయిక నిత్యామీనన్ అన్నారు. భార్యభర్తల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రమిదని దర్శకుడు పాండిరాజ్ పేర్కొన్నారు. తెలుగు వెర్షన్ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత త్యాగరాజన్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, దర్శకత్వం: పాండిరాజ్.