కరోనా కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం దాదాపు తగ్గించేశారు. ఎంత పెద్ద సినిమా విడుదలైనా కూడా ఓటిటీలో వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటున్నారు. బయట వైరస్ కారణంగా ఉండడంతో అసలు కొత్త సినిమాల గురించి ప్రేక్షకులు ఆలోచించడం లేదు. అందుకే దర్శక నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకున్నారు. ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుస్తున్నా.. అటువైపు ఆలోచించడం లేదు. స్టార్ హీరోల సినిమాలు కూడా నేరుగా డిజిటల్ లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం 2 సినిమాను అమెజాన్ లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.మోహన్ లాల్ హీరోగా నటించిన ఒరిజినల్ వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదలై మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే హిందీలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న రాధే సినిమా కూడా ఒకే రోజు థియేటర్లు, డిజిటల్ లో విడుదలవుతుంది.
తాజాగా విజయ్ సేతుపతి సినిమా విషయంలో కూడా నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాల్ తెరకెక్కిస్తున్న తుగ్లక్ దర్బార్ సినిమా హాట్ స్టార్ డిస్నీలో నేరుగా విడుదల చేస్తున్నట్లు కన్ఫామ్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి జోడిగా మంజిమా మోహన్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. విడుదల తేదీ ఇంకా కన్ఫామ్ చేయలేదు కానీ సినిమాను ఓటిటిలో విడుదల చేయడం మాత్రం ఖరారు చేశారు. సంక్రాంతికి జయం రవి నటించిన భూమి సినిమా కూడా ఇలాగే నేరుగా విడుదలైంది. ఇప్పుడు విజయ్ సినిమా విషయంలో కూడా ఇదే చేస్తున్నారు నిర్మాతలు. తెలుగులోనూ తుగ్లక్ దర్బార్ వస్తుంది. విజయ్ సేతుపతికి తెలుగులో ఉన్న ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని అనువదిస్తున్నారు.