గ్లామర్ తారగా పేరున్న ఛార్మీ పూరీ కనెక్ట్స్ బ్యానర్తో నిర్మాతగా మారింది. ‘జ్యోతిలక్ష్మీ’సినిమా నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘రోగ్’, ‘పైసా వసూల్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నది. ఇటీవల విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రానికీ నిర్మాణ బాధ్యతలు వహించింది. ఈ సినిమా బాక్సావద్ద నిరాశపరచింది. ఈ ప్రభావం ఛార్మీపై పడినట్లు తెలుస్తున్నది. తాజాగా ఆమె సోషల్ మీడియా నుంచి కొంతకాలం విరామం తీసుకోబోతున్నట్లు ప్రకటించింది.
‘హాయ్…సోషల్ మీడియా నుంచి చిన్న విరామం తీసుకుంటున్నా. మరో భారీ చిత్రంతో మా సంస్థ పూరీ కనెక్ట్స్ మీ ముందుకొస్తుంది. అప్పటిదాకా సెలవు ’ అని ట్వీట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్తో విడుదలైన ‘లైగర్’ సినిమా ఫలితం నిరాశపర్చడమే ఛార్మీ ఇలా సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండటానికి కారణంగా తెలుస్తున్నది. ఈ సినిమా పరాజయం ప్రభావంతో విజయ్, పూరీ జగన్నాథ్, ఛార్మీల ‘జనగణమన’ సినిమా కూడా ఆగిపోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.