కండ్లు చెదిరే అందంతోపాటు మైమరపించే అభినయం బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ సొంతం. బోల్డ్ కామెంట్స్కి కేరాఫ్గా నిలిచే విద్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నది. ఈ భామ తాజాగా నటించిన ‘దో ఔర్ దో ప్యార్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుని మరోసారి వార్తల్లో నిలిచింది.
తనతో నటించేందుకు కొందరు హీరోలు ఇష్టపడరనీ, అయినప్పటికీ తానేం బాధపడననీ చెప్పుకొచ్చింది. అంతేకాదు బాలీవుడ్లో నెపోటిజంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా పరిశ్రమలో బంధుప్రీతి ఉందంటే తాను అస్సలు అంగీకరించననీ, ఒకవేళ నెపోటిజం ఉండి ఉంటే తారల పిల్లలంతా సక్సెస్ అయ్యేవారనీ అన్నది. అలా జరగడం లేదంటే నెపోటిజం పనిచేయనట్లేదనే కదా అని అభిప్రాయపడింది. పరిశ్రమ ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి సంబంధించింది కాదనీ,
తాను కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాను కాబట్టే ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉందనీ, అదే తన కుటుంబంలో ఎవరైనా సినీ పరిశ్రమకు చెందినవారు ఉన్నట్లయితే తాను పొందే గుర్తింపు వేరుగా ఉండేదనీ చెప్పుకొచ్చింది. తనకు వచ్చిన అవకాశాలన్నీ తన నటన వల్ల వచ్చాయి కానీ, నేపథ్యం చూసి రాలేదన్నది. షారుఖ్, తను నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమా ప్రేక్షకులను బాగా అలరించిందనీ, మరోసారి షారుఖ్తో కలిసి ఓ ప్రేమకథలో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది విద్య. ప్రస్తుతం విద్యాబాలన్ నటిస్తున్న ‘భూల్ భులయ్యా3’ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నది.