బాలీవుడ్లో నాయిక ప్రధాన చిత్రాల ట్రెండ్కు ఊపుతీసుకొచ్చిన నాయిక విద్యాబాలన్. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన ఈ తార ‘పరిణీత’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది. విద్యా బాలన్కు ‘కహానీ’ మంచి పేరు తీసుకొచ్చింది. ‘శకుంతలా దేవి’, ‘షేర్ని’ వంటి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్తో తన ప్రత్యేకత చాటుకుందీ నాయిక. అయితే కెరీర్ తొలినాళ్లలో తనపై ఐరన్లెగ్ అనే ముద్ర వేశారని చెప్పుకుందామె. తాజాగా విద్యా బాలన్ మాట్లాడుతూ…‘టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించాను. కొన్నాళ్లకు మోహన్లాల్ హీరోగా ఓ మలయాళ చిత్రానికి ఎంపికయ్యాను. అయితే ఆ సినిమా ప్రారంభానికి ముందే ఆగిపోయింది. దీంతో నాపై దురదృష్టవంతురాలు అనే ముద్ర వేశారు. నాకు దక్కాల్సిన మరో నాలుగైదు సినిమాల నుంచి కూడా తప్పించారు. అప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయా. నటిగా ఇక అడుగు పడదేమో అనుకున్నా. కానీ దర్శకుడు ప్రదీప్ సర్కార్ ‘పరిణీత’ చిత్రానికి నన్ను నాయికగా ఎంచుకున్నారు. అక్కడి నుంచి నా నట ప్రయాణం సాగుతున్నది’ అని చెప్పింది.