Govinda Naam Mera | బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’ తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్గా విక్కీ నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. గతేడాది ఈయన ప్రాధాన పాత్రలో నటించిన ‘సర్దార్ ఉద్దం’ నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో మూడు షూటింగ్లను పూర్తి చేసుకోగా.. ఒకటి షూటింగ్ దశలోఉంది. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ మరో సారి ఓటీటీలోనే ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు.
విక్కీ కౌశల్, భూమి పడ్నేఖర్, కియారా అద్వాని ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘గోవిందా నామ్ మేరా’. శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహర్ నిర్మించాడు. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ఈ ఏడాది మొత్తం బాలీవుడ్ క్యాలెండర్ పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్లతో నిండి ఉంది. ఈ క్రమంలో గోవిందా నామ్ మేరా సినిమాను విడుదల చేయడం కరెక్టు కాదని భావించి కరణ్ జోహార్ ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నాడట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.