తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. రచయిత, దర్శకుడు మదన్ అనారోగ్యంతో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్కు గురైన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుఝామున కన్నుమూశారు. మధ్యాహ్నం మదన్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన మదన్ ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత సినీ రంగం మీద ఆసక్తితో టాలీవుడ్కు వచ్చారు. ఇక్కడ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్రెడ్డి దగ్గర సహాయకుడిగా ‘సంతోషం’, ‘మనసంతా నువ్వే’ వంటి చిత్రాలకు పనిచేశారు.
చంద్రసిద్ధార్థ్ దర్శకత్వం వహించిన ‘ఆ నలుగురు’ సినిమాతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు మదన్. ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే మాటలు సమకూర్చారు. ఈ చిత్ర విజయంతో వచ్చిన గుర్తింపుతో దర్శకుడిగా మారి జగపతిబాబు హీరోగా ‘పెళ్లయిన కొత్తలో’, ‘ప్రవరాఖ్యుడు’, ఉదయ్ కిరణ్ హీరోగా ‘గుండె ఝల్లుమంది’, మోహన్ బాబు ప్రధాన పాత్రలో ‘గాయత్రి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రతిభావంతుడైన రచయిత, దర్శకుడు మదన్ మృతికి పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం తెలియజేశారు.