సీనియర్ నిర్మాత, దర్శకుడు యు.విశ్వేశ్వరరావు (92) గురువారం చెన్నైలో కరోనాతో కన్నుమూశారు. దివంగత ఎన్టీఆర్కు వియ్యంకుడైన విశ్వేశ్వరరావు విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కంచుకోట, నిలువు దోపిడీ, దేశోద్ధారకులు, పెత్తందార్లు సినిమాల్ని నిర్మించారు. అనంతరం దర్శకుడిగా మారి తీర్పు, మార్పు, నగ్నసత్యం, కీర్తి కాంత కనకం, పెళ్లిళ్ల చదరంగం చిత్రాల్ని రూపొందించారు. నగ్నసత్యం, హరిశ్చంద్రుడు, కీర్తి కాంత కనకం చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా పురస్కారాల్ని పొందారు. రెండు జాతీయ చలన చిత్ర అవార్డుల్ని స్వీకరించారు. దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శిగా కూడా సేవలందించారు. విశ్వేశ్వరరావు మృతిపట్ల తెలుగు నిర్మాతల మండలి సంతాపం ప్రకటించింది.