సీనియర్ హీరో వెంకటేష్ ఈ మధ్య వరుస రీమేక్లు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. చివరిగా ధనుష్ నటించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేశాడు. అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. మరోవైపు మలయాళ హిట్ సినిమా సీక్వెల్ ‘దృశ్యం 2 సినిమా షూటింగ్ని ఇప్పటికే పూర్తి చేయగా, అతి త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయనున్నారు.
ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్గా రూపొందున్న మూవీలోను వెంకటేష్ నటిస్తుండగా, ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా వెంకటేష్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆయన మరో తమిళ సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. 2015లో వచ్చిన తమిళ సూపర్ హిట్ సినిమా ‘ఎన్నై అరిందాల్’ రీమేక్లో నటించడానికి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన ‘ఎన్నై అరిందాల్’ తెలుగులో ‘ఎంతవాడుగానీ’ పేరుతో డబ్ అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే చిత్ర రీమేక్లో వెంకీ నటించాలని అనుకుంటున్నాడట. తమిళ చిత్రం తెలుగులో డబ్ అయి మంచి విజయం సాధించాక ఇప్పుడు అదే కథతో సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.