వేదిక, మంచు లక్ష్మీ, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్సిరీస్ ‘యక్షిణి’. తేజ మార్ని దర్శకుడు. జూన్ 14 నుంచి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సోషియో ఫాంటసీ కథాంశమిది. అలకాపురి అనే లోకం నుంచి ఒక శాపం వల్ల భూమ్మీదకు వచ్చిన యక్షిణి వంద మందిని చంపితేగానీ శాపవిముక్తురాలు కాదు.
యక్షిణి వంద మందిని ఎలా చంపింది? వందో వ్యక్తి ఎవరన్నదే కథలో ఆసక్తికరంగా ఉంటుంది. హారర్తో పాటు థ్రిల్ను పంచుతుంది’ అన్నారు. తన పాత్ర భావోద్వేగభరితంగా భిన్న కోణాల్లో సాగుతుందని కథానాయిక వేదిక చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్ను
నిర్మిస్తున్నారు.